భోపాల్: ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలోని ఫ్రీజర్ (Mortuary Freezer) పని చేయడం లేదు. దీంతో అందులో ఉంచిన ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కుళ్లిపోయింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో సంబంధిత వైద్యాధికారిని తొలగించారు. ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 1న జిల్లాలోని ఉరైయా గ్రామంలో ఒక వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం బినా పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అక్కడి మార్చురీలోని ఫ్రీజర్లో ఆ మృతదేహాన్ని ఉంచారు. అయితే ఆ వ్యక్తిని గుర్తించలేకపోవడంతో మూడు రోజులుగా పోస్ట్మార్టం నిర్వహించలేదు.
కాగా, ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలోని ఫ్రీజర్ పనిచేయడం లేదు. దీంతో అందులో ఉంచిన మృతదేహం కుళ్లసాగింది. మంగళవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ మృతదేహానికి హడావుడిగా పోస్ట్మార్టం నిర్వహించారు. ఈ సంఘటన వైద్యాధికారుల దృష్టికి వెళ్లింది. మార్చురీలోని ఫ్రీజర్ పనిచేయని విషయాన్ని గుర్తించనందుకు బ్లాక్ మెడికల్ ఆఫీసర్ (బీఎంవో) సంజీవ్ అగర్వాల్ను ఆ పోస్ట్ నుంచి తొలగించారు. అంతేగాక ఈ సంఘటనపై విచారణ కోసం త్రిసభ్య కమిటీని జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య నియమించారు.
మరోవైపు మార్చురీలోని ఫ్రీజర్ పని చేయని విషయాన్ని సిబ్బంది తన దృష్టికి తీసుకురాలేదని బీఎంవో సంజీవ్ అగర్వాల్ తెలిపారు. అలాగే మూడు రోజులుగా మృతదేహాన్ని గుర్తించకపోవడంతో పోస్ట్మార్టం ఆలస్యమైనట్లు చెప్పారు. అయితే మృతదేహం కుళ్లుతున్నదని గ్రహించి మంగళవారం పోస్ట్మార్టం నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.
Also Read: