Punjab | ఇది హృదయ విదారక ఘటన.. కుమారుడి మరణవార్త వినడంతో.. ఓ తల్లి గుండె ఆగిపోయింది. దీంతో తల్లీకుమారుడు అంత్యక్రియలను ఒకేసారి నిర్వహించారు. ఈ ఘటన పంజాబ్లోని నవన్షాహ్ర్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నవన్షాహ్ర్ జిల్లాకు చెందిన గుర్విందర్ నాథ్(24) ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. అక్కడ పిజ్జా డెలివరీ ఏజెంట్గా పని చేస్తూ చదువుకుంటున్నాడు. అయితే రెండు వారాల క్రితం నాథ్పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి, అతడి బైక్ను అపహరించారు. తీవ్ర గాయాలపాలైన గుర్విందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ విషయాన్ని అతడి తల్లి నారీందర్ కౌర్కు కుటుంబ సభ్యులు చెప్పలేదు. శుక్రవారం సాయంత్రం గుర్విందర్ డెడ్ బాడీ ఢిల్లీకి చేరిందన్న విషయం తెలుసుకుని నారీందర్ కుప్పకూలిపోయింది. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. దీంతో తల్లీకుమారుడి మృతదేహాలకు ఒకేసారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.