భువనేశ్వర్: రెండు గ్రామాల క్రికెట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఘర్షణ జరిగింది. ‘నో బాల్’ సిగ్నల్ ఇచ్చినందుకు అంపైర్ను కొట్టి కత్తితో పొడిచి (Umpire killed) చంపారు. ఒడిశాలోని కటక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చౌద్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్హిసలంద గ్రామంలో శనివారం శంకర్పూర్, బెర్హంపూర్కు చెందిన అండర్-18 క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మహిలాంద ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల లక్కీ రౌత్, అంపైర్గా వ్యవహరించాడు. అయితే మ్యాచ్ సందర్భంగా ఒకరు బౌలింగ్ చేయగా అంపైర్గా ఉన్న లక్కీ రౌత్ ‘నో బాల్’ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఇది గొడవకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అంపైర్ లక్కీ రౌత్, ప్లేయర్ జగ్ రౌత్ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో జగ్ రౌత్ తన సోదరుడు మునా రౌత్ను పిలిపించాడు. అక్కడకు వచ్చిన అతడు ఆగ్రహంతో లక్కీ రౌత్ను కొట్టాడు. ‘నో బాల్’ సిగ్నల్ ఇచ్చిన ఆ అంపైర్ను కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, తీవ్రంగా గాయపడిన లక్కీ రౌత్ను ఎస్సీబీ వైద్య కాలేజీ హాస్పిటల్కు తరలించారు. అయితే ఆ యువకుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లక్కీ రౌత్ చనిపోయిన వార్త తెలియడంతో ఆ గ్రామంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులను గ్రామస్తులు చుట్టుముట్టి నిరసన తెలిపారు. మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం వెతుకుతున్నారు.
Also Read: