Ultra Processed Food | న్యూఢిల్లీ: రోగాల ముప్పును తగ్గించుకునేందుకు చక్కెర, ఉప్పు తినడాన్ని తగ్గించాలని ప్రజలకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) సూచించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) ఆధీనంలోని ఎన్ఐఎన్ 13 ఏండ్ల తర్వాత భారతీయుల కోసం కొత్త ఆహార నియమావళిని ప్రకటించింది. ప్రజలు ఆహారం, జీవనశైలిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది.
మొత్తం జబ్బుల్లో 56.4 జబ్బులకు కారణం అనారోగ్యకర ఆహారమేనని పేర్కొంది. ఆరోగ్యకర ఆహార అలవాట్లు, శారీరక శ్రమ వల్ల గుండెజబ్బులు, బీపీ ముప్పు భారీగా తగ్గడంతో పాటు టైప్ 2 మధుమేహం ముప్పు 80 శాతం వరకు తగ్గుతుందని తెలిపింది. ఆకాల మరణాల ముప్పునూ గణనీయ స్థాయిలో తగ్గించవచ్చని పేర్కొంది. వంటల్లో నూనెల వినియోగాన్ని తగ్గించాలని, నూనెగింజలు, నట్స్, సీఫుడ్ ద్వారా శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ను పొందాలని సూచించింది.
సమతుల ఆహారం ఇలా..
చక్కెర, కొవ్వులు ఎక్కువగా ఉండే అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం, విభిన్న ఆహారాన్ని తీసుకోకపోవడం కారణంగా దేశంలో ఊబకాయం, సూక్ష్మపోషక లోపాలు వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఈ సంస్థ పేర్కొన్నది. భారతీయులు రోజుకు 20 – 25 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర తీసుకోవద్దని, మనం తినే కార్బోహైడ్రేట్స్ నుంచే ఇంత మొత్తం చక్కెర శరీరానికి అందుతుంది కాబట్టి, వేరుగా చక్కెర కలిపిన పానీయాలు, ఆహారాన్ని తగ్గించాలని సూచించింది.
సమతుల ఆహారాన్ని తీసుకోవాలని, శరీరానికి అందే క్యాలరీల్లో 46 శాతం ధాన్యాలు, మిల్లెట్స్ నుంచి, 15 శాతం క్యాప్పులు, మాంసం, బీన్స్ నుంచి, మిగతా క్యాలరీలు కూరగాయలు, పండ్లు, పాలు, నట్స్ నుంచి అందేలా చూసుకోవాలని తెలిపింది. శరీరానికి ఇచ్చే మొత్తం క్యాలరీల్లో చక్కెర ద్వారా అందేవి 5 శాతం లోపు మాత్రమే ఉండాలని, కొవ్వు ద్వారా 30 శాతం లోపు ఉండేలా చూసుకోవాలని సూచించింది.
ప్రొటీన్ సప్లిమెంట్లు వాడొద్దు
కండలు పెంచేందుకు ప్రొటీన్ పౌడర్లు, సప్లిమెంట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక ప్రమాదాలు ఉన్నాయని ఎన్ఐఎన్ పేర్కొంది. వీటి వల్ల కిడ్నీలు పాడయ్యే ముప్పు ఉంటుందని, ఎముకలు క్షీణిస్తాయని తెలిపింది. శరీర బరువులో ఒక కిలోకు రోజుకు 1.6 గ్రాముల కంటే ఎక్కువ ప్రొటీన్ తీసుకుంటే, అది కండలు పెరిగేందుకు కూడా ఉపయోగపడదని పేర్కొంది.