న్యూఢిల్లీ : 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సర్కార్ ఓటమి లక్ష్యంగా ముందుకుసాగాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ విపక్ష నేతలతో పేర్కొన్నారు. పార్లమెంట్లో కలిసికట్టుగా వ్యవహరించిన విపక్షాలు పార్లమెంట్ వెలుపల కూడా రాజకీయ పోరును విస్తృతం చేయాలని ఆకాంక్షించారు. 19 ప్రతిపక్ష పార్టీల నేతలతో సోనియా శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. విపక్షాలకు 2024 ఎన్నికలే అంతిమ లక్ష్యమని, ఈ ఎన్నికల్లో రాజ్యాంగ విలువల పట్ల విశ్వాసం ఉండే ప్రభుత్వ ఏర్పాటు దిశగా కలిసికట్టుగా పనిచేయాలని సోనియా దిశానిర్ధేశం చేశారు.
ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చకు నిరాకరిస్తూ మోదీ ప్రభుత్వం నిరంకుశంగా, అహంకారపూరితంగా వ్యవహరించడంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పూర్తిగా వృధా అయ్యాయని సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో విపక్ష నేతలు ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, హేమంత్ సోరేన్, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, శరద్ యాదవ్, సీతారాం ఏచూరి, సహా పలు ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు.