న్యూఢిల్లీ: బ్రిటన్కు చెందిన విమాన వాహక నౌకలు హిందూ మహా సముద్రం ప్రాంతానికి చేరాయి. హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్ నేతృత్వంలో యూకేకు చెందిన క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ (సీఎస్జీ) సూయజ్ కాలువలో ప్రయాణించిన తరువాత హిందూ మహా సముద్రం ప్రాంతానికి (ఐఓఆర్) చేరుకున్నది. ఈ యుద్ధ నౌకలు ఈ నెల చివరిలో భారత్ నౌకా దళంతో కలిసి సంయుక్త విన్యాసాలు, యుద్ధ క్రీడలు నిర్వహించనున్నాయి.
భారత్తో రక్షణపరమైన సంబంధాలను మరింత బలపర్చేందుకు ఈ నౌకా విన్యాసాలు దోహదపడతాయని భారత్లోని బ్రిటన్ హైకమిషన్ పేర్కొంది. ఇండో-పసిఫిక్ సముద్ర జలాల్లో కీలకమైన వాణిజ్య మార్గాల ద్వారా ప్రయాణించే స్వేచ్ఛ, సమగ్ర విధానానికి యూకే మద్దతును ఇది ప్రతిబింబిస్తుందని వెల్లడించింది. మరోవైపు బ్రిటన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ను మోహరించడం బ్రిటన్ రక్షణకు ఎంతో కీలకమని యూకే రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్ తెలిపారు.