న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఆ దేశం నుంచి తిరిగి వచ్చిన భారతీయ విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం నిరసన చేపట్టారు. దేశం నలుమూలల నుంచి ఢిల్లీ వచ్చిన వైద్య విద్యార్థులు, తమ తల్లిదండ్రులతో కలిసి జంతర్ మంతర్ వద్ద నిరసన సమావేశం నిర్వహించారు. తమ వైద్య విద్య పూర్తయ్యేందుకు సహకరించాలని, స్థానిక వైద్య కాలేజీలు, యూనివర్సిటీలో అడ్మిషన్లు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగడంతో అక్కడ వైద్య విద్య అభ్యసిస్తున్న సుమారు 20 వేల మందికిపైగా భారత విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో ఇండియాకు తరలించింది. అయితే తమ వైద్య విద్య మధ్యలోనే ఆగిపోవడంపై వారంతా ఆందోళన చెందుతున్నారు.
కాగా, ఉక్రెయిన్లో ఊహించని పరిణామాల వల్ల భారత్కు తిరిగొచ్చిన తమ పిల్లల చదువు, భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని కొందరు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలను అక్కడి నుంచి సురక్షితంగా భారత్కు తెచ్చిన విధంగానే వారి కెరీర్ను కూడా కేంద్ర ప్రభుత్వం కాపాడాలని కోరారు. ఉక్రెయిన్ ఎంబీబీఎస్ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం (ఏఏయూఎంఎస్)లో సభ్యులుగా చేరాలని 18 రాష్ట్రాలకు చెందిన 500 మంది ఉక్రెయిన్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు.
మరోవైపు యుద్ధం వంటి పరిస్థితుల కారణంగా ఇంటర్న్షిప్లు పెండింగ్లో ఉన్న విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు తమ ఇంటర్న్షిప్ మిగిలిన భాగాన్ని దేశంలో పూర్తి చేయడానికి అర్హులని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మార్చి 4న నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే కోర్సు ప్రారంభంలో ఉన్నవారికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు.