ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రాణా ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, శివసేన పార్టీపై మండిపడ్డారు. ఆదివారం ఉదయం తన భర్త, ఎమ్మెల్యే రవిరాణాతో కలిసి ముంబైలో పాత్రికేయులతో మాట్లాడారు. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహేబ్ ఠాక్రే చూపిన బాటను.. ఉద్ధవ్ నాయకత్వంలోని పార్టీ మరిచిపోయిందని, ఇప్పుడు టెన్ జెన్పథ్ ఆధ్వర్యంలో పని చేస్తుందన్నారు. రైతుల సమస్యలు, నిరుద్యోగంపై ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడలేదని ఆరోపించారు.
ఔరంగాబాద్ను శంభాజీనగర్గా మారుస్తామని గతంలో శివసేన ప్రకటించిందని, ఇప్పుడు అది అవసరం లేదని ముఖ్యమంత్రి అంటున్నారన్నారు. ఔరంగాబాద్ పేరు మార్చుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే శివసేన భాగస్వామ్య పక్షాలు మద్దతును ఉపసంహరించుకుంటాయని, దాంతో ప్రభుత్వం పడిపోతుందని ఉద్ధవ్ ఠాక్రే ఆందోళన చెందుతున్నారన్నారు. ముఖ్యమంత్రి మనసులో భయం ఉందని, దీంతో శివసేన తన హిందుత్వ ఎజెండాను పక్కన పెట్టిందని విమర్శించారు.