Nitin Gadkari : రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్ధులతో బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు లేకపోవడంతో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. నితిన్ గడ్కరీ 2014 నుంచి నాగపూర్ లోక్సభ స్ధానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తొలి జాబితాలో నితిన్ గడ్కరీకి చోటు కల్పించకపోవడం పట్ల కాషాయ పార్టీ తీరును ఠాక్రే ఎండగట్టారు. తొలి జాబితాలో గడ్కరీ పేరు లేకపోవడం తనను విస్మయానికి గురిచేసిందని అన్నారు. ఇక తన తండ్రి బాల్ ఠాక్రే తలపెట్టిన ముంబై-పుణే ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం పూర్తి చేయడంలో గతంలో నితిన్ గడ్కరీతో తాను పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే గుర్తుచేసుకున్నారు.
ప్రతిపక్షాలను అణిచివేసే రాజకీయాలు తగవని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీరును ఉద్ధవ్ ఠాక్రే ఎండగట్టారు. నకిలీ హామీలకు గ్యారంటీ అనే పేరు పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత కృపాశంకర్ సింగ్ను అందలం ఎక్కించారని, మహారాష్ట్ర ప్రభుత్వం నేతలను ప్రాసిక్యూట్ చేసే తీరును ఇది ఎత్తిచూపుతున్నదని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు.
Read More :