ముంబై : మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వ్యాఖ్యలపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. మరాఠీలను అవమానిస్తూ గవర్నర్ హద్దు మీరి వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. గవర్నర్ పదవిలో ఉన్న వారిని తాను అవమానించాలని కోరుకోవడం లేదని..ఆ పదవికి తాను గౌరవమిస్తానని అయితే భగత్ సింగ్ కోశ్యారీ మరాఠీలను అవమానించడంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందని ఠాక్రే పేర్కొన్నారు. రాష్ట్రపతి సందేశాన్ని ప్రజలకు గవర్నర్ చేరవేస్తారని, అలాంటి గవర్నర్ తప్పు చేస్తే ఆయనపై ఎవరు చర్య తీసుకోవాలని ప్రశ్నించారు.
కోశ్యారీ మరాఠీలను వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని అన్నారు. గత రెండున్నర ఏండ్లుగా మహారాష్ట్ర గవర్నర్గా కోశ్యారీ రాష్ట్రంలో అన్నీ అనుభవించారని, మహారాష్ట్ర వంటకాలను ఆరగించారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు కొల్హాపురి చెప్పును చూడాల్సిన సమయం ఆసన్నమైందని ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, గుజరాతీలు, రాజస్ధానీలను వెళ్లగొడితే ముంబై, థానేలకు డబ్బు దొరకదని కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆర్ధిక రాజదానిగా వెలుగొందిన ముంబై ఆ ఖ్యాతిని కోల్పోతుందని వ్యాఖ్యానించారు. కోశ్యారి వ్యాఖ్యలపై సేన నేతలు భగ్గుమన్నారు.
మరాఠీలను అవమానించేలా కోశ్యారీ చేసిన వ్యాఖ్యలను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఖండించారు. కోశ్యారీ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయనను గవర్నర్ పదవి నుంచి తొలగించాలని మరో సేన ఎంపీ ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు. ఇక మహారాష్ట్ర అభివృద్ధిలో గుజరాతీలు, రాజస్ధానీల పాత్ర గురించి మాత్రమే తాను ప్రస్తావించానని, మరాఠీలను అవమానించే ఉద్దేశం తనకు లేదని కోశ్యారీ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.