ముంబై: సీఎం అధికార నివాసమైన వర్షానే తాను వీడానని, తిరుగుబాటుదారులపై పోరాటాన్ని కాదని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శుక్రవారం శివసేన భవన్కు తరలివచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. అధికారంపై తనకు ఎలాంటి ఆశలేదన్నారు. చచ్చినా సరే శివసేను వీడమని చెప్పిన నేతలు ఇప్పుడు పారిపోయారని విమర్శించారు. శివసేను చీల్చాలని రెబల్ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని విమర్శించారు. వారికి ఆ ధైర్యం ఉంటే బాలసాహెబ్, శివసేన పేరు ఎత్తుకుండా ప్రజల్లోకి వెళ్లి ఆ పని చేయాలని సవాల్ విసిరారు. శివాజీ మహారాజ్ ఓడిపోయినా ప్రజలు ఆయన వెన్నంటే ఉన్నారని అన్నారు. శివసేనను పునర్నిర్మిస్తానని స్పష్టం చేశారు.
కాగా, తన ఆరోగ్యం సహకరించడంలేదని దీంతో తాను సరిగా పని చేయలేకపోతున్నానని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. మెడ, తల బాధతో పాటు కళ్లు కూడా తెరువలేకపోతున్నానని, అయినా దాని గురించి దిగులు లేదన్నారు. ఏక్నాథ్ షిండేకు తాను ఎంతో చేశానని, తన శాఖను కూడా ఆయనకు ఇచ్చినట్లు చెప్పారు. అలాగే షిండే కుమారుడు ఎంపీ అయ్యేందుకు సహకరించానన్నారు. ఇంత చేసిన తనపై షిండే చాలా ఆరోపణలు చేయడం బాధగా ఉందన్నారు. షిండే రెబెల్ గ్రూప్లో ఉన్నవారిపై తనకు ఎలాంటి పగ లేదన్నారు. వీడిన వారి గురించి ఎందుకు బాధపడాలి అని ప్రశ్నించారు. శివసైనికులు కోరితే అధ్యక్ష పదవి నుంచి తాను దిగిపోతానని పునరుద్ఘాటించారు.