ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై సీఎం ఏక్నాథ్ షిండే మండిపడ్డారు. (Eknath Shinde on Uddhav Thackeray) ఆయన అభివృద్ధి విరోధి అని విమర్శించారు. ఆదివారం ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన డీప్ క్లీనింగ్ డ్రైవ్ కార్యక్రమంలో సీఎం ఏక్నాథ్ షిండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఉద్ధవ్ ఠాక్రే అభివృద్ధి విరోధి అని, తమ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించడంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. ‘ఆయన (ఠాక్రే) రెండున్నరేళ్లుగా ఇంట్లో కూర్చున్నారు. కేవలం షో మాత్రమే చేశారు’ అని ఆరోపించారు. కానీ వాస్తవానికి తాము మాత్రమే అభివృద్ధి చేస్తున్నామని, ముంబై నగరాన్ని శుభ్రం చేస్తున్నామని చెప్పారు.
కాగా, ముంబైలోని ఆరే ల్యాండ్లో మెట్రో కార్ షెడ్, మెట్రో లైన్ల నిర్మాణాన్ని ఉద్ధవ్ ఠాక్రే వ్యతిరేకించారని సీఎం ఏక్నాథ్ షిండే విమర్శించారు. అలాగే ముంబై, నాగ్పూర్ను కలిపే సమృద్ధి హైవే నిర్మాణాన్ని నెమ్మదింపజేసేందుకు ఆయన ప్రయత్నించారని ఆరోపించారు. తమపై వేలు చూపే నైతిక హక్కు వారికి ఉందా? అని ప్రశ్నించారు.