ముంబై: మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాపై ఆయన అనుచరుడు, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ వినూత్నంగా స్పందించారు. శివసేనకు చెందిన సొంత నేతలు ఇలా వెన్నుపోటు పొడిచారంటూ ఒక స్కెచ్ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తెల్లని కుర్తాలో ఉన్న వ్యక్తిని ఉద్ధవ్ ఠాక్రేగా చిత్రీకరించారు. ఆ కుర్తా వెనుక భాగం చిరిగి ఉండటంతోపాటు, మూడు పంజా గుర్తులతో పాటు రక్తం కారుతున్నట్లుగా ఉంది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను ఇలా వెన్నుపోటు పొడిచారని, బీజేపీ మద్దతుతో ఆయనను వేగంగా సీఎం పదవి నుంచి దించారన్న భావన కలిగేలా ఈ ఆర్ట్ ఉన్నది. ‘సరిగ్గా ఇలా జరిగింది’ అని సంజయ్ రౌత్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
కాగా, ఏక్నాథ్ షిండే వర్గం తిరుగుబాటు నేపథ్యంలో అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవాలన్న గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో శివసేన సవాల్ చేసినా ఫలితం లేకపోయింది. అత్యున్నత న్యాయస్థానం గవర్నర్ నిర్ణయాన్నే సమర్థించింది. మహారాష్ట్రలో నెలకొన్న అన్ని రాజకీయ సంక్షోభాలు ఫ్లోర్ టెస్ట్తో పరిష్కారమవుతాయని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు బుధవారం ఎలాంటి ఊరట ఇవ్వకపోవడంతో ఉద్ధవ్ ఠాక్రే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారం కోసం తాను ఎప్పుడూ కూడా పాకులాడలేదన్నారు. పార్టీ నేతలు తనను వద్దనుకుంటే శివసేన అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తానని గత శుక్రవారం పార్టీ నేతలనుద్దేశించి ఆయన అన్నారు.
नेमके हेच घडले! pic.twitter.com/nNkBXNAzB3
— Sanjay Raut (@rautsanjay61) June 30, 2022