ముంబై : దర్యాప్తు సంస్థలను ప్రయోగించి సెలబ్రిటీలను పట్టుకుని ఫోటోలు క్లిక్మనిపించడంలోనే కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తి అధికమని ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసును ఉద్దేశించి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేంద్రంపై విమర్శలు గుప్పించారు. డ్రగ్స్ పట్టుబడటం మహారాష్ట్రలోనే జరుగుతోందా అని ఆయన నిలదీశారు. ముంబైలోని షణ్ముకానంద్ హాల్లో జరిగిన దసరా ర్యాలీలో ఠాక్రే మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు.
ముంద్రా పోర్టులో రాష్ట్ర పోలీసులు ఇటీవల రూ 150 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నా కేవలం సెలబ్రిటీల అరెస్ట్పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారని మండిపడ్డారు. సెలబ్రిటీలను పట్టుకుని వారి ఫోటోలను తీయడంలోనే కేంద్ర దర్యాప్తు సంస్ధలు (ఎన్సీబీ) హడావిడి చేస్తున్నాయని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటూ బీజేపీయేతర ప్రభుత్వాలను వేధిస్తోందని ఆరోపించారు. విపక్ష ప్రభుత్వాలను కూలదోసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. హిందుత్వకు బీజేపీతో ప్రమాదం పొంచి ఉందని, కాషాయ పార్టీ నేతలకు మహాత్మ గాంధీ, వీర్ సావర్కర్ల పేర్లు ప్రస్తావించే అర్హత కూడా లేదని ఠాక్రే విరుచుకుపడ్డారు.