ముంబై, మే 14: బీజేపీపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే విరుచుకుపడ్డారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు తెంచుకున్నప్పుడే తాము ‘గాడిద’లను తరిమికొట్టామంటూ వ్యాఖ్యానించారు. ముంబైలో శనివారం శివసేన పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఠాక్రే మాట్లాడుతూ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
‘మేము గధా(గాడిద) ధారి హిందువులమని ఫడ్నవిస్ అంటున్నారు. అయితే ఇక్కడ మీకు ఒకటి చెబుతున్నాను.. బీజేపీతో పొత్తు తెంచుకున్నప్పుడే మేం గాడిదలను తరిమికొట్టాం’ అని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తుతో 25 ఏండ్లు వృథా అయ్యాయని అన్నారు. బీజేపీ ఫేక్ హిందూత్వ బురఖా ధరించిందన్నారు. మహారాష్ట్ర నుంచి ముంబైని వీడదీయాలనే కుట్రలు ఫలించవని ఈ సందర్భంగా ఠాక్రే స్పష్టంచేశారు.