జైపూర్, జూలై 2: ఉదయ్పూర్ హత్య కేసు నిందితులతో బీజేపీకి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. సమాజాన్ని విడగొట్టడమే ఆ పార్టీ ఎజెండాగా పెట్టుకున్నదని మండిపడ్డారు. కన్హయ్య లాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి బీజేపీ నాయకులతో సన్నిహితంగా ఉన్న రెండు ఫొటోలను ఈ మేరకు షేర్ చేశారు. మరోవైపు, ఉదయ్పూర్ హత్య కేసు ప్రధాన నిందితుల్లో ఒకరు బీజేపీ సభ్యుడని కాంగ్రెస్ కూడా ఆరోపించింది. బీజేపీ మైనార్టీ నేతలతో నిందితుడు రియాజ్ అక్తారీ ఉన్న ఫొటోను విడుదల చేసింది. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది.
నిందితులపై దాడి
ఉదయ్పూర్ హత్య కేసులో ఎన్ఐఏ కోర్టు నలుగురు నిందితులను 10 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలీసులు నలుగురిని శనివారం జైపూర్ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ ముర్దాబాద్, కన్హయ్య హంతకులకు మరణశిక్ష విధించాలంటూ కొందరు న్యాయవాదులు నినాదాలు చేశారు. నిందితులు కోర్టు నుంచి బయటకు వస్తుండగా వారిపై కొందరు దాడి చేశారు.