కోజికోడ్, జూలై 15: మతాన్ని కేంద్రీకృతంగా చేసుకుని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతిని రాజకీయ ఆయుధంగా వాడుకోవాలనుకుంటున్నదని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. యూసీసీపై అభిప్రాయ సేకరణకు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో శనివారం భారీయెత్తున జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చట్టాల్లో ఏమన్నా వివక్ష ఉన్నట్టయితే దానిని ఆయా సామాజిక వర్గాలతో చర్చలు, ఇతర మార్గాల ద్వారా సరిదిద్దుకోవాలే తప్ప యూసీసీ అమలు ద్వారా కాదని అన్నారు. ఏకరూపత అంటే సమానత్వం అని అర్థం కాదని పేర్కొన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా సమానత్వం పక్షాన తమ పార్టీ నిలబడుతుందని చెప్పారు. దానికోసమే పోరాటం జరపాలని అన్నారు.