Uttar Pradesh | లక్నో, ఆగస్టు 6: బీజేపీపాలిత రాష్ర్టాల్లో ఇటీవలి కాలంలో అమానుష ఘటనలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దళితులు, మైనార్టీలు, ఆదివాసీలపై దాడులు పెరుగుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తిపై మూత్రం పోసిన ఘటనను మరువకముందే.. తాజాగా ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చికెన్, డబ్బులు దొంగతనం చేశారనే ఆరోపణలపై ఓ పౌల్ట్రీఫాం నిర్వాహకులు ఇద్దరు బాలురుపై అమానుషంగా, పైశాచికంగా ప్రవర్తించారు. బాధిత పిల్లలను దూషించి, కిందకు పడేసి, చేతులు వెనక్కి కట్టి చితకబాదారు. ఒక బాటిల్లో మూత్రం నింపి, వారి చేత బలవంతంగా తాగించారు. పచ్చి మిరపకాయలు, ఉప్పు స్నాక్స్ వంటివి తినిపించి రాక్షస ఆనందం పొందారు. అంతటితో ఆగకుండా ప్రైవేటు భాగాల్లోకి(మలద్వారం) మిరపకాయలను చొప్పించి, కారం పూసి మృగాల్లా వ్యవహరించారు. పిల్లల శరీరంలోకి పెట్రోల్ను కూడా ఇంజెక్ట్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సిద్దార్ధ్నగర్ జిల్లా పత్రాబజార్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకొన్నది.
మూత్రం తాగకుంటే.. చంపేస్తాం!
నిందితులు ఈ దుశ్చర్యకు పాల్పడిన వీడియోలను రికార్డు చేసి, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. వీడియోలు బయటకు వచ్చిన తర్వాత పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. బాధిత ఇద్దరు పిల్లల వయసు 10 నుంచి 14 ఏండ్లు మధ్య ఉన్నట్టు తెలుస్తున్నది. చికెన్, డబ్బులు దొంగతనం చేశారని ఆరోపిస్తూ కొంత మంది ఇద్దరు బాలురను నిర్బంధించారు. మూత్రం తాగేందుకు నిరాకరిస్తే.. చంపేస్తామని బెదిరించి బలవంతంగా తాగించారు. అనంతరం బట్టలు విప్పించి, మలద్వారంలో మిరపకాయలు చొప్పించారు. పిల్లలు ఆర్తనాదాలు చేస్తున్నా కనికరించలేదు. రాక్షసానందం పొందుతూ చిత్రహింసలు పెట్టినట్టు వీడియోల్లో ఉన్నది. బాధితుల్లో ఒకరి తండ్రి మహ్మద్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.
వాట్సాప్లో సీఎంపై విమర్శలు.. గ్రూప్ అడ్మిన్ అరెస్ట్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై వాట్సాప్ గ్రూప్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగర పాలిక పరిషత్ బాదోహి’ పేరుతో ఉన్న ఈ వాట్సాప్ గ్రూప్లో బాదోహికి చెందిన అందరు కార్పొరేటర్లతో పాటు పలువురు పౌరులు సభ్యులుగా ఉన్నారు. పట్టణంలోని సమస్యలను ఆ గ్రూప్లో కార్పొరేటర్ల దృష్టికి తెస్తుండేవారు. ఈ నెల 4న ఆ గ్రూప్లో సీఎంను విమర్శిస్తూ ఓ వ్యక్తి వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఫిర్యాదు నమోదు కావడంతో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ షాహబుద్దీన్ అన్సారీని అరెస్ట్ చేశారు.