Natural Calamities | ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో 2022-23లో 1,997 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. లోక్సభలో లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రకృతి విపత్తుల కారణంగా దేశంలో 1,997 మంది జనం చనిపోయారని.. అదే సమయంలో 30,615 మూగజీవాలు మృతి చెందాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. 18,54,901 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఆసియా పసిఫిక్ విపత్తు నివేదిక-2021 భారతదేశంలోని పేద జనాభాలో 60 శాతం మందికి ప్రకృతి వైపరీత్యాల ప్రమాదం ఉందని పేర్కొంది. 2040 నాటికి దాదాపు 71 శాతం బలహీన వర్గాల ప్రజలు వాతావరణ మార్పులతో సంభవించే విపత్తుల బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేసింది.