జైపూర్: స్కూల్లోని తరగతి గదిలో దళిత విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నేపథ్యంలో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు (Teachers Suspended). రాజస్థాన్లోని బెహ్రోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కోట్పుత్లీలోని ప్రభుత్వ స్కూల్కు చెందిన 15 ఏండ్ల దళిత విద్యార్థి స్కూల్ హాస్టల్లో ఉండి చదుతున్నాడు. అయితే ఇద్దరు ఉపాధ్యాయులు కులంపేరుతో తనను దూషించి వేధిస్తున్నారని తండ్రికి చెప్పాడు. ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయాడు. ఈ నేపథ్యంలో క్లాస్ రూమ్లోకి సీలింగ్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా, ఈ విషయం తెలియడంతో విద్యార్థి కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. ఇద్దరు టీచర్లతోపాటు ఆ స్కూల్ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దళిత విద్యార్థిని వేధించి అతడి మరణానికి కారకులైన ఇద్దరు టీచర్లపై ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు ఆ ప్రభుత్వ స్కూల్ కూడా ఈ సంఘటనపై స్పందించింది. ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే బాధిత కుటుంబానికి పరిహారం ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు, స్థానికులు నిరసన విరమించారు.