తిరువనంతపురం: మెడికల్ ఎంట్రెన్స్ నీట్ పరీక్ష రాస్తున్న అమ్మాయిలను ఫ్రిస్కింగ్ చేసిన కేసులో కేరళ పోలీసులు మరో ఇద్దరు టీచర్లు అరెస్టు చేశారు. కేరళలో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినుల లోదుస్తుల్ని విప్పించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. బ్రాలు తీసాకే పరీక్ష రాసే అనుమతి ఇచ్చారు. ఈ వ్యవహారంలో ప్రొఫెసర్ ప్రిజి కురియన్, డాక్టర్ శ్యాంనంద్ను గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో అరెస్టయినవారి సంఖ్య ఏడుకు చేరింది.
ఈ నెల 17న నీట్ పరీక్ష సందర్భంగా కేరళలోని కొల్లాంలోని మార్థమాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేంద్రంలో విద్యార్థినులను బ్రాలు తీసేసిన తర్వాతే లోపలికి అనుమతించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు చెందిన అయిదు ఫిర్యాదులు నమోదు అయ్యాయి. దీంతో కాలేజీలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు.
మెటల్ హుక్స్ ఉన్న బ్రాలను తీసివేయాలని ఫ్రిస్కింగ్ సిబ్బంది వత్తిడి చేశారు. దీంతో ఓ 17 ఏళ్ల అమ్మాయి బ్రా లేకుండానే 3 గంటల పాటు పరీక్ష రాసింది. అయితే ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నీట్ ఇచ్చిన డ్రెస్కోడ్ ప్రకారమే తన కూతురు డ్రెస్సు వేసుకుందని, ఇన్నర్వేర్ డ్రెస్సుల గురించి నీట్లో ఎటువంటి కోడ్లేదని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తర్వాత కొంద మంది విద్యార్థినిలు కూడా ఇదే తరహా ఫిర్యాదు చేశారు.