MP’s suspended | లోక్సభలో బుధవారం మరో ఇద్దరు ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముగిసే వరకు సస్పెండ్ అయ్యారు. ఇద్దరు సభ్యుల్లో కేరళకు చెందిన థామస్ చజికదన్, ఏఎం ఆరిఫ్ ఉన్నారు. చజికదన్ కేరళ కాంగ్రెస్ (ఎం) ఎంపీ కాగా.. ఆరిఫ్ సీపీఎం పార్టీకి చెందిన ఎంపీ. ఇద్దరు సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించి వెల్ ఆఫ్ హౌస్లోకి ప్రవేశించినందుకు సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకు మొత్తం ప్రతిపక్ష 143 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 22న ముగియనున్నాయి.
ఈ నెల 14న 14 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. సోమవారం మరో 78 మంది, మంగళవారం 49 మంది, బుధవారం ఇద్దరు ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. లోక్సభ, రాజ్యసభలో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ నెల 13న పార్లమెంట్ భద్రతా వైఫల్యం నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు నినాదాలు చేస్తూ పట్టుబట్టాయి. మరో వైపు సభల్లో సభాపతి ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఎంపీలను సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం సమర్థించుకోగా.. ప్రతిపక్షాల గొంతును ప్రభుత్వం అణచివేస్తుందని ఆరోపించారు.