లక్నో, సెప్టెంబర్ 14: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరి జిల్లాలో మరో దారుణం జరిగింది. ఇద్దరు దళిత మైనర్ యువతులను చంపి, చెట్టుకు ఉరి తీశారు. ఈ ఘటన నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకొన్నది. కొందరు దుండగులు బైక్లపై వచ్చి తన కూతుళ్లను ఎత్తుకెళ్లారని, కాసేపటికే వారు చెట్టుకు వేలాడుతూ కనిపించారని మృతురాళ్ల తల్లి వెల్లడించారు.
విషయం తెలుసుకొన్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో యోగి సర్కారుపై యూపీ మాజీ సీఎం అఖిలేశ్యాదవ్ మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లలకు రక్షణ కరువైందని విమర్శించారు. వార్తాపత్రికలు, చానళ్లలో తప్పుడు ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన యూపీలో శాంతి భద్రతలు మెరుగుపడవని బీజేపీ సర్కారుకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ చురక అంటించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.