UP | ప్రతాప్గఢ్: తప్పిపోయిన ఓ బర్రె తనదంటే తనది అంటూ ఇద్దరు వ్యక్తులు వాదులాడుకున్నారు. వీరిద్దరిలో ఎవరు అసలు యజమాని అని కనిపెట్టలేక పంచాయితీ పెద్దలు, పోలీసులు చేతులెత్తేశారు. ఇక లాభం లేదనుకొని, బర్రెకే నిర్ణయం వదిలేశారు. ఆ బర్రె అసలు యజమానిని గుర్తించి, అతడి ఇంటికి చేరింది. వివరాల్లోకెళితే.. యూపీలోని ప్రతాప్గఢ్ జిల్లా మహేశ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్షరాంపూర్ గ్రామంలో నందలాల్ సరోజ్కు చెందిన బర్రె కొన్ని రోజుల క్రితం తప్పిపోయింది. అది పూరే హరికేశ్ గ్రామానికి చేరింది. ఆ ఊరికి చెందిన హనుమాన్ దాన్ని కట్టేశాడు.
నందలాల్ ఎంత వెతికినా బర్రె ఆచూకీ దొరకలేదు. చివరికి హనుమాన్ వద్ద ఉన్నదని తెలిసి, అక్కడికి వెళ్లి అడగ్గా.. ఆ బర్రె తనదేనని వాదించాడు. దీంతో నందలాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, పంచాయితీకి పిలిపించాడు. ఆ బర్రె తనదేనని హనుమాన్, నందలాల్ వాదులాడుకున్నారు. ఏం చేయాలో పాలుపోకపోవటంతో స్టేషన్ ఆఫీసర్ ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ బర్రెను రెండు ఊళ్ల మధ్య విడిచిపెట్టి, ఆ బర్రె ఏ యజమాని చెంతకు చేరితే వారే అసలైన యజమాని అని స్పష్టం చేశారు. దానికి ఇరు వర్గాలు సమ్మతించాయి. దీంతో ఆ బర్రెను తీసుకొచ్చి రెండు ఊళ్ల మధ్య విడిచిపెట్టగా, అది నేరుగా నందలాల్ ఇంటికి చేరింది. దీంతో హనుమాన్ను పోలీసులు, గ్రామస్థులు మందలించారు.