భోపాల్: మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లోకి మరో రెండు చీతాలు (Cheetah) అడుగుపెట్టాయి. అంతర్జాతీయ చీతా దినోత్సవం సందర్భంగా అగ్ని, వాయు అనే రెండు మగ చీతాలను నేషనల్ పార్కులోకి బుధవారం విడుదల చేశారు. ఇన్నాళ్లు ఎన్క్లోజర్లో ఉన్న వాటిని.. భద్రతకు సంబంధించిన అన్నిరకాల చర్యలు తీసుకున్న తర్వత అడవిలో స్వేచ్ఛగా విహరించేందుకు విడిచిపెట్టామని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, లయన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తమ్ కుమార్ శర్మ వెల్లడించారు. దీంతో తమ సఫారీ యాత్ర సందర్భంగా ఈ రెండు అద్భుతమైన జంతువులను టూరిజం జోన్లో చూసేందుకు సందర్శకులు అవకాశం కలుగుతుందన్నారు. అంతర్జాతీయ చీతా దినోత్సవాన్ని పురస్కరించుకుని అగ్ని, వాయు అనే రెండు మగ చీతాలను విజయవంతంగా కూనో నేషనల్ పార్క్ పారాండ్ ఫారెస్ట్ ఏరియాలో విడిచిపెట్టామన్నారు. రెండు చీతాలు పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నాయని తెలిపారు.
పారాండ్ ప్రాంతం అహేరా టూరిజం జోన్లోకి వస్తుందని, సందర్శకులు తమ సఫారీ యాత్ర సందర్భంగా వాటిని చూడొచ్చన్నారు. నేషనల్ పార్క్లోకి విడిచిపెట్టడానికి ముందు ఈ రెండు చీతాలను బోనుల్లో ఉంచి సంరక్షించారు. ప్రస్తుతం కునో నేషనల్ పార్క్లో 12 కూనలు సహా 24 చీతాలు ఉన్నాయి. దేశంలో తగిన ఆవాస ప్రాంతాలు లేకపోవడం, వేట తదితర కారణాలతో 70 ఏళ్ల క్రితం అంతరించిపోయాయి. చివరి చీత 1947లో ఛత్తీగఢ్లో కనిపించింది. దేశంలో చీతాలు అంతరించి పోయాయి అని ప్రభుత్వం 1952లో ప్రకటించింది.
మళ్లీ వాటి ఉనికిని చాటాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చీతా ప్రాజెక్టును చేపట్టింది ఈ క్రమంలో 2022 సెప్టెంబర్ 17న నమీబియా నుంచి తెప్పించిన 8 చీతాలను ప్రధాని మోదీ కునో నేషనల్ పార్క్ ఎన్క్లోజర్లలోకి విడుదల చేశారు. వాటిలో ఐదు ఆడ, మూడు మగ చీతాలు ఉన్నాయి. అనంతరం 2023 ఫిబ్రవరిలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తెప్పించి పార్క్లో వదిలారు. ప్రస్తుతం కునో పార్క్లో 24 చీతాలు ఉండగా వాటిలో 12 పెద్దవి, అనేక కూన చీతలు ఉన్నాయి.