శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో (Srinagar) ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్లోని రైనావారి ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమారంతో స్థానిక పోలీసులతో కలిసి సీఆర్పీఎఫ్ దళాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృంధాలపై ముష్కరులు కాల్పులు జరిపారని, ప్రతిగా భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు.
వారిని లష్కరే తొయిబాకు (LeT) చెందిన స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించామని తెలిపారు. వారిద్దరు పౌరులను చంపిన కేసుల్లో నిందితులుగా ఉన్నారని వెల్లడించారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు.