ఇంఫాల్: మణిపూర్లో హింస కొనసాగుతున్నది. మంగళవారం ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కౌట్రక్ గ్రామంలో రెండు బృందాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. మరొకరు కనిపించకుండా పోయారు. ఈ ఘటనలో బీజేపీ యువ మోర్చా మాజీ అధ్యక్షుడు మనోహర్ మయుమ్ బరిష్ శర్మ గాయపడ్డారు. ఇంఫాల్ పశ్చిమ, కాంగ్పోక్పీ జిల్లాల సరిహద్దులో రెండు వర్గాల గ్రామ వలంటీర్ల మధ్య ఈ కాల్పులు జరిగాయి. తాజా హింసాత్మక ఘటనల వల్ల కడంగ్బంద్, కౌట్రక్, కంగ్చుప్ గ్రామాల ప్రజలు పారిపోయారు. ఆదివారం రెండు గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక గ్రామ వలంటీర్ మరణించగా, నలుగురు గాయపడ్డారు. 60 వేలకు పైగా కేంద్ర భద్రతా దళాలను మోహరించినా ఇంకా హింస ఎందుకు కొనసాగుతున్నదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.