కేంద్రం ఏకపక్ష ధోరణికి నిరసనగా దేశాన్ని వీడుతున్న సంస్థలు
కేంద్రం నిర్ణయాలు ఐటీరంగానికి క్షేమకరం కాదన్న సర్ఫ్షార్క్
న్యూఢిల్లీ, జూన్ 8: సైబర్ సెక్యూరిటీ నెపంతో వీపీఎన్ సర్వీసుల ద్వారా వినియోగదారుల డాటాను తీసుకోవాలన్న కేంద్రంలోని మోదీ సర్కారు కుట్రపై సదరు కంపెనీలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఐటీశాఖ ఆధ్వర్యంలోని సెర్ట్-ఇన్ ప్రతిపాదించిన మార్గదర్శకాలను పాటించలేమని పేర్కొంటూ దేశంలో ఇకపై సర్వీసులను కొనసాగించలేమని ఎక్స్ప్రెస్వీపీఎన్ ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో సర్ఫ్షార్క్ కూడా చేరింది. దేశంలో వీపీఎన్ సేవలను నిలిపివేయనున్నట్టు ప్రకటించిన సంస్థ.. కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు ఐటీరంగానికి అంత క్షేమకరం కాదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
వ్యక్తిగత సమాచారం, లొకేషన్ తెలియకుండా ఇంటర్నెట్లోని సైట్లను బ్రౌజ్ చేసుకోవడానికి వీపీఎన్ సర్వీసులు సాయపడుతాయి. యూజర్ల పేరు, ఐపీ అడ్రస్, ఈ-మెయిల్, ఫోన్, సర్వీసు ఎప్పటి నుంచి తీసుకున్నారు? తదితర వివరాలను వీపీఎన్ సంస్థలు ఐదేండ్లపాటు స్టోర్ చేయాలని సెర్ట్-ఇన్ గత ఏప్రిల్ 26న మార్గదర్శకాల్లో పేర్కొంది. దీనిపై వీపీఎన్ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. యూజర్ల వివరాలు బహిర్గతం చేయడం వీపీఎన్ సర్సీసుల మూల సూత్రానికే విరుద్ధమని పేర్కొన్నాయి.