న్యూఢిల్లీ: వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు భారతీయ పైలట్లు మరణించారు (Indian Pilots Died) . ఒక పైలట్ విమానాశ్రయంలో చనిపోగా, మరొక పైలట్ విమానంలో గుండెపోటు వల్ల మరణించాడు. ఇండిగో ఫ్లైట్ కెప్టెన్ గురువారం నాగ్పూర్ నుంచి పూణేకు విమానాన్ని నడపాల్సి ఉంది. బోర్డింగ్ గేట్ వద్దకు చేరుకున్న అతడు అక్కడ స్పృహకోల్పోయాడు. వెంటనే హాస్పిటల్కు తరలించగా ఆ పైలట్ అప్పటికే మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా, ఇండిగో పైలట్ బుధవారం రెండు సెక్టార్స్లో విమానాలు నడిపినట్లు తెలిసింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి 7 గంటల మధ్య త్రివేండ్రం నుంచి పూణే మీదుగా నాగ్పూర్ వరకు విమానం నడిపాడు. ఆ తర్వాత 27 గంటలపాటు విశ్రాంతి తీసుకున్నాడు. గురువారం నాలుగు సెక్టార్లలో విమానాలు నడుపాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు తొలి ఫ్లైట్ను టేకాఫ్ చేయాల్సి ఉంది. అయితే ఆ పైలట్ బోర్డింగ్ గేట్ వద్ద కుప్పకూలి మరణించాడు.
మరోవైపు ఖతార్ ఎయిర్వేస్లో పని చేస్తున్న భారతీయ పైలట్ బుధవారం ఢిల్లీ-దోహ విమానంలో అదనపు క్రూ సిబ్బందిగా ప్రయాణించాడు. అయితే గుండెపోటు రావడంతో విమానంలోనే చనిపోయాడు. ఆ పైలట్ ఖతార్ ఎయిర్వేస్కు ముందు స్పైస్జెట్, అలయన్స్ ఎయిర్, సహారాలో పని చేశాడు. కాగా, ఇద్దరు భారతీయ పైలట్ల మరణాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ధృవీకరించింది.