న్యూఢిల్లీ: ఆఫ్థనిస్థాన్లోని భారతీయ ఎంబసీలో తిరిగి పోస్టింగ్ ఇప్పించాలంటూ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)కి చెందిన ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆఫ్ఘన్లో తాజా పరిస్థితుల నేపథ్యంలో దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన కోర్టు, ఈ సమస్య పూర్తిగా పరిపాలనాపరమైనదని పేర్కొంటూ వారి పిటిషన్ను తిరస్కరించింది. కాగా, తాలిబన్లు కాబూల్ను స్వాధీనం చేసుకున్న ఆగస్ట్ 15కు ముందు ఇది జరిగింది.
గత ఏడాది ఆగస్ట్లో ఐటీబీపీకి చెందిన మహిళా కానిస్టేబుళ్లను కాబూల్లోని భారత రాయబార కార్యాలయంలో భద్రతాపరమైన సహాయం కోసం రెండేండ్ల కాలపరిమితిలో నియమించారు. ఈ ఏడాది జూన్లో కొందరిని భారత్కు రప్పించారు. అయితే, కాబూల్ ఎంబసీలో రెండేండ్ల వరకు పోస్టింగ్ ఇచ్చి ఏడాదిలోపే భారత్కు రప్పించడంపై ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించే పిల్లలు, ఆడవారిని తనిఖీ చేసేందుకు కాబుల్ ఎంబసీలో తమ సేవలు అవసరమని, దీని కోసమే తమకు శిక్షణ ఇచ్చారని తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేప్యంలో తమను తిరిగి అక్కడ నియమించేలా ఆదేశం ఇవ్వాలని కోర్టును కోరారు.
కాగా, జస్టిస్ రాజీవ్ సహాయ్, జస్టిస్ అమిత్ బన్సాల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై ఇటీవల విచారణ జరిపింది. మరోవైపు వారి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఐటీబీపీ, కాబూల్ రాయబార కార్యాలయంలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు పని చేస్తున్నారని కోర్టుకు తెలిపింది. దీంతో ఈ సమస్య పూర్తిగా పరిపాలనాపరమైనదని కోర్టు పేర్కొంది. కానిస్టేబుళ్లు తమ సేవలు ఎక్కడ అవసరమో వారే నిర్ణయించుకోలేరని చెబుతూ వారి పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
ఒకవైపు తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్న ప్రమాదకర పరిస్థితిల్లో ఐటీబీపీ మహిళా కానిస్టేబుళ్లు అక్కడ పోస్టింగ్ కోరడంపై న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే తాలిబన్లు కాబూల్ను తమ ఆధీనంలోకి తీసుకున్న ఆగస్ట్ 15కు ముందు ఈ పిటిషన్ దాఖలు కాగా, దీనిపై తీర్పు కూడా దీనికి కొన్ని రోజుల ముందే వెలువడింది.
మరోవైపు ఆగస్ట్ 15న తాలిబన్లు కాబూల్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, 99 ఐటీబీపీ కమాండోలతో పాటు మూడు స్నిఫర్ డాగ్స్ను ఆఫ్ఘనిస్థాన్ నుంచి వాయుసేన విమానంలో భారత్కు తరలించారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో ఐటీబీపీ సిబ్బంది లేరు. కాబూల్లోని రాయబార కార్యాలయంతోపాటు ఆ దేశంలోని నాలుగు భారత కాన్సులేట్ల భద్రత కోసం మోహరించిన సిబ్బంది అంతా భారత్కు తిరిగివచ్చారు.