భువనేశ్వర్: ఒడిశాలోని జాజ్పూర్ జిల్లా కొరాయి రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. సోమవారం తెల్లవారుజామున కొరాయి రైల్వే స్టేషన్లో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో బోగీలు ప్లాట్ఫామ్పై బోల్తాపడ్డాయి. అయితే ప్లాట్ఫామ్పై వేచిఉన్న ప్రయాణికులపై బోగీలు పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హుఠాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బోగీల కింద మరికొంత మంది చిక్కుకుపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
సోమవారం ఉదయం 6.44 గంటలకు కొరాయి స్టేషన్లో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. మొత్తం 54 బోగీల్లో 10 బోగీలు బోల్తాపడి.. స్టేషన్లోకి చొచ్చుకెళ్లాయి. దీంతో భువనేశ్వర్ వెళ్లే రైలుకోసం ప్లాట్ఫామ్పై వేచిఉన్న ప్రయాణికులపైకి బోగీలు దూసుకెళ్లడంతో ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు. ఎంతమంది గాయపడ్డారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, క్షతగాత్రులను స్థానిక దవాఖానకు తరలించామని చెప్పారు.