బళ్లారి/బెంగళూరు, సెప్టెంబర్ 15: కరెంటు లేకపోవటంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులు మృతిచెందారు. ఈ ఘటన బుధవారం కర్ణాటకలోని బళ్లారి ప్రభుత్వ దవాఖానలో చోటుచేసుకొన్నది. కిడ్నీ వ్యాధితో మౌలా హుస్సేన్ (35), పాము కరిచి చిట్టెమ్మ (30) సహా పలువురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే, బుధవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కరెంటు పోయింది. పవర్ బ్యాకప్ సదుపాయం కూడా లేకపోవటంతో వెంటిలేటర్లు పనిచేయక వీరిద్దరూ మృతిచెందారు.
ఈ ఘటనపై గురువారం కర్ణాటక అసెంబ్లీలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అత్యవసర పరిస్థితులు ఎదురవుతాయని తెలిసీ, జనరేటర్లను ఏర్పాటు చేయకపోవటంపై అధికార బీజేపీని నిలదీశాయి. ఘటనకు బాధ్యత వహిస్తూ ఆరోగ్యమంత్రి కే సుధాకర్ వెంటనే రాజీనామా చేయాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బాధిత కుటుంబాలకు వెంటనే రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని కోరాయి.