శ్రీనగర్: లఢక్లో సైనిక వాహనం నదిలోయలో పడిన ఘటన ఇంక కళ్లముందే ఉండగా.. జమ్ములోని తావి బ్రిడ్జిపై నుంచి ఓ వ్యాన్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తావి బ్రిడ్జిపై నుంచి మెటాడోర్ (Matador) అదుపుతప్పి నదిలో పడిపోయింది. దీంతో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
లఢక్లోని తుర్తుక్ సెక్టార్లో సైనికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పింది. రోడ్డు పక్కన 60 అడుగుల లోతులో ఉన్న ష్యోక్ నదిలోయలో పడిపోయింది. శుక్రవారం 9 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు సైనికులు మరణించారు. 19 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వాహనంలో 26 మంది సైనికులు ఉన్నారు. వారంతా పార్తాపూర్ క్యాంప్ నుంచి హనీఫ్ సబ్ సెక్టార్కు వెళ్తుండగా వాహనం అదుపు తప్పింది. గాయపడ్డ సైనికులను వెంటనే పార్తాపూర్లోని 403 ఫీల్డ్ దవాఖానకు తరలించారు.
కాగా, జమ్ము నుంచి దోడా జిల్లాకు వెళ్తున్న ఓ బస్సు ఉధంపూర్లోని బట్ల్ బల్లియన్ ప్రాంతంలో బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న 25 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.