Air India | ఎయిర్ ఇండియా విమానం కాక్ పిట్లోకి ఇతరులు రావడంపైన సంస్థ యాజమాన్యం ఆగ్రహంతో ఉంది. నాలుగు నెలల్లో రెండు సార్లు ఈ ఘటనలు చోటు చేసుకోవడం నిబంధనల ఉల్లంఘనేనని ఎయిర్ ఇండియా సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్ బెల్ విల్సన్ శుక్రవారం తేల్చి చెప్పారు. ఒక ఘటన నుంచి తప్పనిసరిగా గుణపాఠం నేర్చుకోవాలన్నారు. ‘పదేపదే అటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయంటే నిబంధనలకు అనుగుణంగా మనం సరిగ్గా స్పందించడం లేదన్నమాట. నిర్లక్ష్యం తదితర అంశాలు కారణం` అని క్యాంప్ బెల్ విల్సన్ పేర్కొన్నారు.
ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ఫ్లయిట్ కాక్ పిట్ లోకి, ఈ నెల ప్రారంభంలో డొమెస్టిక్ ఫ్లయిట్ కాక్ పిట్ లోకి ఇతరులను కాక్ పిట్ సిబ్బంది, పైలట్లు ఆహ్వానించారు. రెండు కేసుల్లోనూ సంబంధిత పైలట్ల లైసెన్సులను డీజీసీఏ ఏడాదిపాటు సస్పెండ్ చేసింది. ఫిబ్రవరిలో నిబంధనల ఉల్లంఘనపై స్పందించనందుకు ఎయిర్ ఇండియాపై డీజీసీఏ ఫైన్ విధించింది. రెండో దఫా ఎయిర్ ఇండియా యాజమాన్యం కాసింత సకాలంలో స్పందించింది.
ఈ ఘటనలపై సిబ్బందికి క్యాంప్ బెల్ విల్సన్ శుక్రవారం ఈ-మెయిల్ పెట్టారు. ‘కాక్ పిట్ నిబంధనలను ఉల్లంఘించిన మన పైలట్ల లైసెన్లను డీజీసీఏ రద్దు చేసిన వార్త మీరు చదివే ఉంటారు. ఏడాది సస్పెన్షన్ చాలా ఎక్కువ, కానీ, రెండో సస్పెన్షన్లో కొంత తక్కువ ఉంది. ఇది అర్థం చేసుకోదగ్గ అంశం’ అని పేర్కొన్నారు.
‘మన పరిశ్రమ ‘జస్ట్ కల్చర్’ మైండ్ సెట్ తో పని చేస్తున్నది. పొరపాట్లు జరిగినప్పుడు వాటి నుంచి పద్దతులు మెరుగు పర్చుకోవాలి. డీజీసీఏ క్రమశిక్షణ చర్యలు తీసుకునే పరిస్థితి రాకుండా మిగతా వారు పని చేస్తారని భావిస్తున్నాం` అని క్యాంప్ బెల్ విల్సన్ తెలిపారు.