ముంబై: వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తాజాగా ముంబైలోని బందూప్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్నేహితుడిని.. భర్త తన తమ్ముడు, మరో స్నేహితుడితో కలిసి హతమార్చాడు.
బందూప్ ఏరియాలో అవినాష్ అశోక్ థొరానే (31) అనే వ్యక్తి తన భార్య, తమ్ముడు అశ్విన్ అశోక్ థొరానే (24)తో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరికి సెవ్రీలోని ఓ కన్స్ట్రక్సన్ కంపెనీలో పనిచేసే సివిల్ ఇంజినీర్ అవినాష్ (24) స్నేహితుడు. అవినాష్ ద్వారా ఘట్కోపర్లోని కన్స్ట్రక్సన్ కంపెనీలో పనిచేసే సివిల్ ఇంజినీర్ సూరజ్ పతాయిత్ (24) పరిచయమయ్యాడు.
ఈ క్రమంలో కొంతకాలం క్రితం అవినాష్ థొరానే ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి సూరజ్ పతాయిత్ను ఆహ్వానించారు. ఆ సందర్బంలో అవినాష్ భార్యతో సూరజ్కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది తెలుసుకున్న అవినాష్ థొరానే, తన తమ్ముడు అశ్విన్, స్నేహితుడు అవినాష్తో కలిసి సూరజ్ను హత్య చేశాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నదమ్ములైన అవినాష్ థొరానే, అశ్విన్ థొరానేలను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు, సివిల్ ఇంజినీర్ అవినాష్ కోసం గాలిస్తున్నారు.