Twitter @ Jal shakti | కేంద్ర ప్రభుత్వ జల్ శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతాను దుండగులు హ్యాక్ చేశారు. దీనిపై ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. 9 రోజుల వ్యవధిలోనే రెండో మేజర్ సైబర్ అటాక్ జరుగడం విస్మయాన్ని కలిగిస్తున్నది. ఇప్పటికే ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రధాన సర్వర్ను గుప్పిట్లోకి తీసుకున్న సైబర్ నేరగాళ్లు.. పెద్ద మొత్తంలో డబ్బు ర్యాన్సమ్గా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ ట్విట్టర్ హ్యాండిల్ గురువారం ఉదయం హ్యాక్కు గురైంది. దీన్ని సరిచేసే పనిలో భద్రతా సంస్థలు, సైబర్ నిపుణులు నిమగ్నమై ఉన్నారు. కాగా, మధ్యాహ్నం సమయానికల్లా ఖాతాను పునరుద్ధరించినట్లు సమాచారం అందింది. క్రిప్టో వాలెట్ సూయ్ వాలెట్ను ప్రమోట్ చేసే ట్వీట్ ఒకటి మంగళవారం ఉదయం 5:38 గంటలకు మంత్రిత్వ శాఖ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ అయింది. సూయ్ లోగో, పేరును చూపించడానికి కవర్ ఫొటోతో పాటు ఖాతా ప్రొఫైల్ ఫొటో కూడా త్రివర్ణ పతాకం నుంచి మార్చేశారు. ఈ ట్వీట్లో అనేక తెలియని ఖాతాలు కూడా ట్యాగ్ చేయబడ్డాయి. అయితే, గురువారం మధ్యాహ్నం సమయానికల్లా ఖాతాను సైబర్ నిపుణులు పునరుద్ధరించగలిగారు. అన్ని ట్వీట్లను తొలగించారు. ఈ ఘటనపై భద్రతా సంస్థలు, సైబర్ నిపుణులు విచారణ జరుపుతున్నారు.
ఇండస్ఫేస్ ఇటీవలి నివేదిక ప్రకారం.. భారతదేశంలో ప్రతి నెలా ఆరోగ్య సంరక్షణ రంగంపై దాదాపు 3 లక్షల సైబర్ దాడులు జరుగుతున్నాయి. ప్రపంచంలో సైబర్ దాడుల్లో భారత్ రెండో స్థానంలో ఉన్నది. ప్రతి నెలా అమెరికా ఆరోగ్య రంగంపై దాదాపు 5 లక్షల సైబర్ దాడులు జరుగుతున్నాయి.