న్యూఢిల్లీ: ట్విట్టర్ సంస్థకు చెందిన ఆఫీసు బిల్డింగ్లను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. తక్షణమే మూసివేత మొదలైనట్లు కూడా ఆ సంస్థ చెప్పింది. మళ్లీ ఆఫీసు కార్యాలయాలను నవంబర్ 21వ తేదీ నుంచి తెరువనున్నట్లు ఉద్యోగులకు సమాచారం చేరవేసినట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే ఎందుకు ఆఫీసులను మూసివేస్తున్నారన్న దానిపై ట్విట్టర్ సంస్థ క్లారిటీ ఇవ్వలేదు. ఎక్కువ సమయం పనిచేయాలని కొత్త ఓనర్ ఎలన్ మస్క్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఆ కంపెనీలోని చాలా మంది ఉద్యోగులు సంస్థను వీడుతున్నారు. వందల సంఖ్యలో ఉద్యోగులు రిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పని విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని, లేదంటే ఉద్యోగులు సంస్థను వీడాలని ఇటీవల మస్క్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ సంస్థను వదిలి వెళ్లాలనుకుంటున్న వాళ్లకు మూడు నెలల జీతాన్ని ఇవ్వనున్నారు. ట్విట్టర్ ఉద్యోగులు తమ ఇంటర్నల్ చాట్ గ్రూపుల్లో సెల్యూట్ ఎమోజీలు, ఫేర్వెల్ మేసేజ్లు చేసుకుంటున్నారు. ఇంజినీర్లు కూడా సంస్థను వీడుతున్నట్లు మెసేజ్లు చేశారు.