Twisha Sharma : త్విషా శర్మ మృతి కేసుకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టు వెల్లడైంది. ఉరి వల్లనే ఆమె మరణించిందని రిపోర్టులో తేలింది. అలాగే, ఆమె ఒంటిపై అనేక గాయాలున్నట్లు కూడా వెల్లడైంది. మోడల్ అయిన త్విషా శర్మ ఈ నెల 12న భోపాల్లోని తన ఇంటిలో ఉరివేసుకుని మరణించింది. ఒక జిమ్నాస్టిక్ రింగ్ తాడుతో ఇంటి మేడపై రాత్రి 10.26 గంటలకు ఉరి వేసుకుంది. అదే రోజు అర్ధరాత్రి ఆమె మరణించినట్లు వెల్లడైంది.
ఆమె మృతదేహానికి భోపాల్లోని ఎయిమ్స్కు చెందిన ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ రిపోర్టు ప్రకారం.. త్విషా శర్మ మెడపై గాయాలున్నాయి. ముఖం వాచిపోయి ఉండటం, చెవులు, గోళ్లు నీలి రంగులోకి మారిపోయి ఉండటం, కుడి కంటిలో రక్తపు మరకలు వంటివి వైద్యులు గుర్తించారు. శరీరంలోని ఇతర చోట్లా గాయాలున్నాయి. నోయిడాకు చెందిన 33 ఏళ్ల త్విషా శర్మకు గత ఏడాది డిసెంబర్లో భోపాల్కు చెందిన సమర్ధ్ సింగ్తో వివాహమైంది.
అయితే, పెళ్లైన తర్వాత నుంచి భర్త, అతడి కుటుంబ సభ్యులు వరకట్నం కోసం వేధించినట్లు త్విషా శర్మ కుటుంబ సభ్యులు తెలిపారు. వారే ఆమెను హత్య చేసి ఉంటారని త్విష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, వారు చేసిన ఆరోపణల్ని త్విష అత్త, రిటైర్డ్ జడ్జి అయిన గిరిబాలా సింగ్ ఖండించారు. త్విషా శర్మ డ్రగ్స్ తీసుకునేదని ఆరోపించారు. డ్రగ్స్ తీసుకోకపోతే ఆమె చేతులు వణికేవని చెప్పారు. త్విష ప్రవర్తన విచిత్రంగా ఉండేదని, తను ప్రెగ్నెంట్ అయ్యానని తెలిసిన తర్వాత తొలగించుకునేందుకు ప్రయత్నించిందని ఆమె అత్త ఆరోపించారు.
త్విష ప్రవర్తనతో తన కొడుక సమర్ధ్ సింగ్ మానసికంగా కుంగిపోయాడని ఆరోపించింది. అయితే ఆమె డ్రగ్స్ తీసుకుందని తెలిపేందుకు ఆధారాలు లేవని పోలీసులు తేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సమర్ధ్ శర్మ పరారీలో ఉన్నాడు.