TVK Chief Vijay : తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ చీఫ్ విజయ్కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు విజయ్పై ఈసీ కేసు నమోదు చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు పెరావల్లూర్ పోలీస్ స్టేషన్లో విజయ్పై కేసు నమోదైంది. ఒక పబ్లిక్ మీటింగ్ సందర్భంగా రూల్స్ అతిక్రమించినందుకుగాను, ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయ్పై కేసు రిజిష్టర్ చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
దీంతో రాష్ట్రమంతా ఎన్నికల వేడి మొదలైంది. ఈ నేపథ్యంలో టీవీకే చీఫ్ విజయ్ రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. ఇటీవల ఒక బహిరంగ సభ సందర్భంగా నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ఈసీ ఆరోపించింది. అధికారుల అనుమతి లేకుండా సభలో ఏకంగా 30 లౌడ్ స్పీకర్లు ఉపయోగించాడని, అలాగే 5,000 మందికి మించి ప్రజలు సభకు హాజరయ్యారని, దీనివల్ల ప్రజలకు అసౌకర్యం కలిగించారని ఆరోపిస్తూ ఈసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, రోడ్లు బ్లాక్ చేయడం, అంబులెన్స్కు దారి ఇవ్వకపోవడం, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి అంశాల్ని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విజయ్పై ఐదు సెక్షన్ల కింద కేసు నమోదైంది. విజయ్తోపాటు సభకు హాజరైన దాదాపు 5,000 మంది పార్టీ కార్యకర్తల్ని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు సమాచారం. దీనిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఇక, విజయ్ ఇప్పటికే తన ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్ సమర్పించారు. తనకు రూ.603 కోట్ల స్థిర, చర ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తోంది. అన్ని స్థానాలకు ఆయన అభ్యర్థుల్ని ప్రకటించారు. తమిళనాడులోనే కాకుండా, పుదుచ్చేరికి కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. టీవీకే పార్టీకి ఇవే తొలి ఎన్నికలు.234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగబోతున్నాయి. మే 4న ఫలితాలు వెల్లడవుతాయి.