జైపూర్ : రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Poll Results) బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి విజయం దిశగా దూసుకుపోతుండటంతో అశోక్ గెహ్లాట్ సారధ్యంలోకి కాంగ్రెస్ సర్కార్కు భంగపాటు ఎదురైంది. ఇక గుజ్జర్ల ప్రాబల్యం కలిగిన తూర్పు రాజస్ధాన్లో కాషాయ పార్టీ అత్యధిక స్ధానాలు గెలుచుకోవడం వెనుక కాంగ్రెస్లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల వర్గ పోరు ప్రధాన కారణంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం అనంతరం గుజ్జర్ నేత పైలట్ను సీఎంగా ఎంపిక చేయకపోవడం పట్ల గుజ్జర్లలో అసంతృప్తి వ్యక్తమైంది. 2020లో పైలట్ నేతృత్వంలో తిరుగుబాటుతో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కూలిపోయే పరిస్ధితి తలెత్తింది. ఆపై సమస్యను హైకమాండ్ సర్దుబాటు చేసినా గుజ్జర్లలో అసంతృప్తి గూడుకట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెహ్లాట్, పైలట్ ఇద్దరూ పార్టీ గెలుపు కోసం పనిచేసినా ఇరు శిబిరాల్లో విభేదాలు కొనసాగాయి.
తూర్పు రాజస్ధాన్లో పైలట్, గెహ్లాట్ వర్గాల మధ్య విభేదాలు పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపాయి. ఈ ప్రాంతంలోని 59 అసెంబ్లీ స్ధానాల్లో బీజేపీ 38 స్ధానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ 19 స్ధానాల్లో గెలుపొందింది. ఇక 199 స్ధానాలు కలిగిన రాజస్ధాన్ అసెంబ్లీలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కంటే 14 సీట్లు అధికంగా ఏకంగా 114 స్ధానాల్లో ఆధిక్యం కనబరచగా, కాంగ్రెస్ 70 స్ధానాలకు పరిమితమైంది.
Read More :