Turrebaz Khan | ఖాన్ 1859 జనవరి 8న కారాగారం నుంచి తప్పించుకున్నాడు. చివరికి జనవరి 24న తూప్రాన్ దగ్గర తురేబాజ్ ఖాన్ను చంపేశారని తెలుస్తున్నది. ఈ ద్రోహానికి పాల్పడింది తూప్రాన్ తాలూకాదార్ మీర్జా ఖుర్బాన్ అలీ బేగ్.
హైదరాబాద్ నగరంలో సిపాయీల తిరుగుబాటు అనగానే వెంటనే గుర్తుకువచ్చే పేరు తురేబాజ్ ఖాన్. మరికొంతమంది తిరుగుబాటుదార్లతో కలసి ఖాన్ హైదరాబాద్లో బ్రిటిష్ రెసిడెంట్ మేజర్ డేవిడ్సన్కు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. హైదరాబాద్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మౌల్వీ అల్లావుద్దీన్ తీవ్రస్వరంలో ఉపన్యాసాలను ఇచ్చాడు. ఆ స్ఫూర్తితో తురేబాజ్ ఖాన్, మరో 500 మంది రోహిల్లాలతో కలిసి తిరుగుబాటు కొనసాగించాడు.
కోఠిలో బ్రిటిష్ రెసిడెన్సీలో బందీగా ఉన్న జమేదార్ చీదాఖాన్ను విడిచిపెట్టడానికి తిరుగుబాటు జరిగింది. తురేబాజ్ ఖాన్ నాయకత్వంలో రోహిల్లాలు రెసిడెన్సీ మీద దాడి నిర్వహించారు. దాడులకు అబ్బాన్ సాహెబ్, జయగోపాల్ దాస్ అనే వ్యాపారుల ఇళ్లను ఆశ్రయంగా చేసుకున్నారు. అప్పుడు హైదరాబాద్ ప్రధానిగా ఉన్న సాలార్జంగ్ తిరుగుబాటు గురించి రెసిడెంట్ డేవిడ్సన్కు ఉప్పందించాడు. దాంతో బ్రిటిష్ సైన్యాలు ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి.
మేజర్ ఎస్సీ బ్రిగ్స్ నాయకత్వంలో బ్రిటిష్ సైన్యాలు రోహిల్లాల మీద దాడులు జరిపాడు. కేవలం ఒక్క రాత్రిలోనే తిరుగుబాటును అణచివేశాడు. తురేబాజ్ ఖాన్ సహా తిరుగుబాటులో పాల్గొన్నవారిని పట్టుకొని జీవిత ఖైదు విధించారు. అయితే ఖాన్ 1859 జనవరి 8న కారాగారం నుంచి తప్పించుకున్నాడు. చివరికి జనవరి 24న తూప్రాన్ దగ్గర తురేబాజ్ ఖాన్ను చంపేశారని తెలుస్తున్నది. ఈ ద్రోహానికి పాల్పడింది తూప్రాన్ తాలూకాదార్ మీర్జా ఖుర్బాన్ అలీ బేగ్. ఖాన్ పార్థివదేహాన్ని హైదరాబాద్ తీసుకువచ్చి రెసిడెన్సీ దగ్గర వేలాడదీసినట్లు చారిత్రక రికార్డుల నుంచి తెలుస్తున్న సమాచారం.