తుమకూరు: కర్ణాటకలో సీఎం పదవి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్నది. కీలక నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం పదవి తనకే అంటే తనకే అని పట్టుబడుతుండటంతో ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీకి కష్టంగా మారింది. ఎందుకంటే సిద్ధరామయ్య గతంలో ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించి మంచి సీఎంగా పేరు తెచ్చుకున్నారు. డీకే శివకుమార్ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రధాన పాత్ర పోషించారు.
ఈ నేపథ్యంలో ఇద్దరికీ ఎలా న్యాయం చేయాలో పాలుపోక కాంగ్రెస్ హైకమాండ్ తలపట్టుకుంది. బెంగళూరులో వ్యవహారం తేలకపోవడంతో ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో కీలక నేతలు సమావేశమై కర్ణాటక సీఎం పదవిపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో సందట్లో సడేమియా అన్నట్టుగా మరో సీనియర్ జీ పరమేశ్వర పేరు కూడా సీఎం రేసులో తెరపైకి వచ్చింది.
ఇవాళ తుమకూరులో జీ పరమేశ్వర మద్దతుదారులు తమ నాయకుడికే సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ జెండాలు చేబూని, పరమేశ్వరకు మద్దతుగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
Tumakuru, Karnataka | Supporters of Congress leader G Parameshwara staged a protest demanding CM post for him. pic.twitter.com/cjdpEFqQvf
— ANI (@ANI) May 16, 2023