అయోధ్య, జనవరి 26: అయోధ్య శ్రీరాముడి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా ఉన్నందున రాష్ర్టాల వారీగా స్లాట్లు కేటాయించాలని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు భావిస్తున్నది. ఒక్కో రాష్ర్టానికి షెడ్యూల్ కేటాయించేలా, అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలకు ఆహ్వానాలు పంపేందుకు రెడీ అయ్యింది. ఆయా తేదీలు, సమయాల్లోనే ఆయా రాష్ట్రం నుంచి భక్తులను దర్శనానికి పంపేలా ఏర్పాట్లు చేయాలని కోరనున్నట్టు తెలిసింది. స్లాట్లు కేటాయిస్తే భక్తుల రద్దీని నియంత్రించేందుకు వీలు అవుతుందని ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అటు.. భక్తుల రద్దీ తగ్గాక ఎన్నారైలను ఒకేసారి రామయ్య దర్శనానికి ఆహ్వానించాలని ట్రస్టు భావిస్తున్నది.
బాలక్ రామునికి రాగ సేవ శుక్రవారం ప్రారంభమైంది. మార్చి 10 వరకు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ సంప్రదాయాలకు చెందిన దాదాపు 100 మంది ప్రముఖ సంగీత కళాకారులు పాల్గొంటారు. హేమ మాలిని, మాలిని అవస్థి, అనూప్ జలోటా, అనురాధ పౌడ్వాల్, సోనాల్ మాన్సింగ్, వైజయంతిమాల తదితరులు కళాకారుల జాబితాలో ఉన్నారు..