వాషింగ్టన్, ఏప్రిల్ 19: ఒక వైపు దౌత్య చర్చలు.. మరో వైపు బలప్రయోగం ముప్పు.. పశ్చిమాసియా సంక్షోభానికి తెరదించేందుకు రెండో విడత చర్చలకు సోమవారం సాయంత్రం పాకిస్థాన్లోని ఇస్లామాబాద్కు తమ ప్రతినిధులు చేరుకుంటారని వెల్లడిస్తూనే మరో వైపు ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘నా ప్రతినిధులు చర్చల కోసం పాకిస్థాన్లోని ఇస్లామాబాద్కు వెళ్తున్నారు. వారు సోమవారం సాయంత్రం అక్కడ ఉంటారు’ అని ఆయన ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. తాను న్యాయమైనదిగా, సహేతుకమైనదిగా అభివర్ణించిన ఒప్పందాన్ని అంగీకరించడానికి కనుక విఫలమైతే ఇరాన్ మౌలిక సదుపాయాలు లక్ష్యంగా భారీ దాడులు చేస్తామని హెచ్చరించారు. హొర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకలపై కాల్పులకు పాల్పడటం ద్వారా ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. పూర్తిగా తెరిచిన హొర్ముజ్ జలసంధిని కొన్ని గంటలకే మూసివేస్తున్నట్టు ఇరాన్ చేసిన ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగతాళి చేశారు. ఈ విషయంలో ఇరాన్ కొంచెం తెలివిగా వ్యవహరించిందని, అయితే ఆ చర్యతో అమెరికాను బ్లాక్మెయిల్ చేయలేరని అన్నారు.
యుద్ధం ఎలా గెలువాలో ఇజ్రాయెల్కు తెలుసు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ను ప్రశంసలతో ముంచెత్తాడు. సంఘర్షణల సమయంలో కొన్ని దేశాలు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టాయన్నారు. కానీ, ఇజ్రాయెల్ మాత్రం వాటిలా కాకుండా అన్ని సమయాల్లో తమ వెంట నిలిచిందన్నారు. ఇజ్రాయెలీలు చాలా ధైర్యవంతులు, విధేయులు, తెలివైనవారని ప్రశంసలు కురిపించారు. యుద్ధంలో ఆ దేశం గట్టిగా పోరాడుతున్నదని, ఎలా గెలువాలో దానికి తెలుసునని అన్నారు.
ఇరాన్ నౌకలను సీజ్ చేయాలని వ్యూహం
పశ్చిమాసియా సంక్షోభం ఎనిమిదో వారంలోకి చేరుకున్నా ఇరాన్ లొంగే పరిస్థితి కనపడకపోవడంతో అమెరికా మరో వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఇరాన్ వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్లు ఎక్కడున్నా సీజ్ చేయాలని వ్యూహం పన్నుతున్నది. ఇప్పటికే ఇరాన్ నౌకాశ్రయాలను దిగ్బంధించిన అగ్రరాజ్యం.. దాని జల రవాణా వ్యవస్థను కూడా దెబ్బ తీసేందుకు చకచకా వ్యూహాలు పన్నుతున్నది.
‘బాబ్ అల్ మాండెబ్ను మూసేస్తాం’
పశ్చిమాసియా సంక్షోభం నివారణకు జరుగుతున్న శాంతి ప్రయత్నాలకు అమెరికా అడ్డగింత ఇలాగే కొనసాగితే హొర్ముజ్ను ఇరాన్ మూసివేసినట్టుగానే యెమెన్లోని బాబ్ అల్ మాండెబ్ జలసంధిని తామూ మూసివేస్తామని హౌతీ గ్రూప్ సీనియర్ అధికారి ఒకరు ఆదివారం ట్రంప్ను హెచ్చరించారు. ‘బాబ్ అల్ మాండెబ్ జలసంధిని మూసివేయాలని కనుక నిర్ణయించుకుంటే అప్పుడు మానవాళి, కనిపించని అదృశ్య శక్తులు కూడా దానిని తెరువడానికి పూర్తిగా శక్తిహీనులవుతారు. కాబట్టి శాంతికి ఆటంకం కలిగించే విధానాలను యూఎస్ ముగించాలి’ అని హుస్సేన్ అల్-ఎజ్జీ ఒక ప్రకటనలో కోరారు. అంతర్జాతీయ సరుకు రవాణాకు హొర్ముజ్, అల్ మండేబ్ కీలకం. వాటిని మూసివేస్తే ఇంధన సంక్షోభం మరింత పెరిగే అవకాశం ఉంది.