న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల కేసులో జైలు శిక్షను పదేళ్లకు పెంచే కొత్త నేర చట్టానికి వ్యతిరేకంగా లారీ, ప్రైవేట్ బస్సు డ్రైవర్లు దేశ వ్యాప్తంగా నిరసనకు దిగుతున్నారు. (Truckers Protest ) హర్యానాలోని జింద్లో సోమవారం ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు సమ్మెకు దిగారు. ఆటో డ్రైవర్లు కూడా కొత్త చట్టానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కొత్త వేదికను ఏర్పాటు చేశారు. కొత్త చట్టంపై నిరసనగా ఆదివారం పశ్చిమ బెంగాల్ హుగ్లీ జిల్లాలో జాతీయ రహదారి-2ను డ్రైవర్లు బ్లాక్ చేశారు.
కాగా, ఎవరూ ఉద్దేశపూర్వకంగా ప్రమాదాలు చేసి పారిపోరని డ్రైవర్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే జనం కొడతారని ఆందోళన వ్యక్తం చేశారు.
పొగమంచు కారణంగా ప్రమాదం జరిగితే, డ్రైవర్ తప్పు లేకపోయినప్పటికీ కొత్త చట్టం ప్రకారం పదేళ్లు శిక్ష పడుతుందని వాపోయారు. ఈ నేపథ్యంలో కొత్త నేర చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు కొత్త నేర చట్టం ప్రకారం వాహనాలను ఢీకొట్టి పారిపోయిన డ్రైవర్లు రోడ్డు ప్రమాదం గురించి సంబంధిత అధికారులకు వెల్లడించకపోతే పదేళ్లు జైలు శిక్ష విధిస్తారు. ఇప్పటి వరకు ఐపీసీ సెక్షన్ 304 ఏ కింద నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమైన కేసులో రెండేళ్ల వరకు మాత్రమే జైలు శిక్ష విధిస్తున్నారు.