న్యూఢిల్లీ : ఢిల్లీలోని తెలంగాణ భవన్ గులాబీమయం అయింది. తెలంగాణ భవన్ పరిసరాల్లో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, జెండాలతో అలంకరణ చేశారు. తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం సేకరించాలనే డిమాండ్తో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ధాన్యం సేకరణపై తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ దీక్ష చేపట్టింది. రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ధాన్యం సేకరణలో ఒకే విధానం ఉండాలనే డిమాండ్తో ఈ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షలో మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నాయకులు పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి టీఆర్ఎస్ అల్టిమేటం ఇవ్వనుంది. దీక్ష వేదికగా టీఆర్ఎస్ తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. కేంద్రంపై పోరును మరింత తీవ్రం చేసే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు.