న్యూఢిల్లీ, జూలై 28: దేశ అత్యున్నత పదవిపై కాంగ్రెస్ సభ్యుడి అభ్యంతకర వ్యాఖ్యలు, ప్రతిగా బీజేపీ నినాదాలతో లోక్సభలో అట్టుడికింది. ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’గా పేర్కొంటూ కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అనుచిత వ్యాఖ్యలు చేయగా, వాటి ప్రతిస్పందనతో పార్లమెంటు దిగువసభలో ప్రతిధ్వనించింది. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల వాగ్వాదాలు, నిరసనలతో పార్లమెంటు దద్దరిల్లింది. దేశ ప్రథమ మహిళను అధిర్ అగౌరవపరిచారంటూ లోక్సభలో బీజేపీ ఎంపీలు నిరసనకు దిగారు. అధిర్ రంజన్ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా మహిళల గౌరవాన్ని కించపర్చడమేనని పేర్కొంటూ.. సోనియాగాంధీనీ వివాదంలోకి లాగేందుకు ప్రయత్నించారు.
ఆమె కూడా క్షమాపణ చెప్పాలంటూ కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, నిర్మలాసీతారామన్ సహా బీజేపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రతిగా కాంగ్రెస్ సభ్యులూ నినాదాలు చేశారు. సోనియాను లక్ష్యంగా చేసుకుని అనవసరపు వివాదంలోకి ఆమెను లాగడాన్ని వారు తప్పుపట్టారు. సభ వెలుపల జరిగిన విషయాన్ని పట్టుకొని బీజేపీ సభ్యులు అనవసరపు రచ్చ చేస్తున్నారని.. ధరల పెరుగుదల, జీఎస్టీ, అగ్నిపథ్ అంశాలపై నుంచి దేశప్రజల దృష్టిని మరల్చేందుకు పనిగట్టుకునే ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు విమర్శించారు. ఇరుపక్షాల నినాదాల, ప్రతినినాదాల మధ్య గందరగోళం వాతావరణంలో లోక్సభ పలుమార్లు వాయిదాపడింది.
సోనియా జీ.. మాఫీ మాంగో..
రాష్ట్రపతి ముర్మును ‘రాష్ట్రపత్ని’ అని సంబోధిస్తూ బుధవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి మీడియాతో మాట్లాడిన మాటలు లోక్సభలో తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియాను వివాదంలోకి లాగేందుకు బీజేపీ సభ్యులు ప్రయత్నించారు. అత్యున్నత పదవిలో ఉన్న మహిళను కాంగ్రెస్ సభ్యుడు అవమానించడాన్ని సోనియాగాంధీ ఆమోదించారని వారు విరుచుకుపడ్డారు.
ఈ వ్యవహారంపై సోనియా కూడా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కొవిడ్ నుంచి కోలుకొని సభకు హాజరైన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కూడా అధిర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్య. కాంగ్రెస్ లోక్సభాపక్ష నేతగా అధిర్ను సోనియానే నియమించారు. కాబట్టి ఆమె కూడా యావత్తు జాతికి క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ‘సోనియాజీ.. మాఫీ మాంగో’ అంటూ బీజేపీ ఎంపీలు సభలో పెద్దయెత్తున నినాదాలు చేశారు.
‘డోంట్ టాక్ టు మీ..’
అధిర్ వ్యాఖ్యలపై సోనియా క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు సభలో కొంతసేపు నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ నేత రమాదేవి వద్దకు సోనియా వెళ్లి మాట్లాడుతుండగా.. మధ్యలో స్మృతి ఇరానీ జోక్యం చేసుకున్నారు. దీంతో సోనియా.. ‘డోంట్ టాక్ టు మీ (నాతో మాట్లాడొద్దు)’ అంటూ ఆమెను వారించారు. సోనియా వ్యవహరించిన తీరు తమకు భయాన్ని కలిగించిందని నిర్మలా సీతారామన్ అన్నారు.
కాగా, అధిర్ వివాదంలో తాను క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ నేతలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారని.. సోనియా తనను అడిగారని రమాదేవి మీడియాకు తెలిపారు. ‘అధిర్ను కాంగ్రెస్ లోక్సభాపక్ష నేతగా మీరే నియమించారు కాబట్టి, ఈ డిమాండ్ తెరపైకి వచ్చినట్టు తాను బదులిచ్చానని వివరించారు. కాగా, రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలను తప్పుబడుతూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) సహా, 13 రాష్ర్టాలకు చెందిన మహిళా కమిషన్లు అధిర్కు నోటీసులు జారీ చేశాయి.
తప్పే.. నోరు జారా..: అధిర్ రంజన్
తన వ్యాఖ్యలపై అధిర్ రంజన్ స్పందించారు. పొరపాటున నోరు జారినట్లు అంగీకరించారు. ‘బుధవారం విజయ్చౌక్లో నిరసనలు తెలియజేస్తున్న సమయంలో.. ‘మీరు ఎక్కడికి వెళ్లనున్నారు?’ అంటూ కొందరు జర్నలిస్టులు నన్ను ప్రశ్నించారు. దీనికి నేను రాష్ట్రపత్ని అని పొరపాటున సమాధానమిచ్చా. వెంటనే పొరపాటును గ్రహించి.. ఆ వీడియోను ప్రసారం చేయొద్దని మీడియాకు చెప్పా. అయితే అలా జరుగలేదు’ అని తెలిపారు. రాష్ట్రపతి ముర్ముకు క్షమాపణలు చెప్పేందుకూ సిద్ధంగా ఉన్నానని, కపటబుద్ధి ఉన్న బీజేపీకి మాత్రం క్షమాపణలు చెప్పబోనని అన్నారు.