న్యూఢిల్లీ: ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో (Parliament) ఆందోళనలు కొనసాగించాలని టీఆర్ఎస్తోపాటు విపక్షాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు ధర్నా చేయనున్నారు. అదేవిధంగా రాజ్యసభలో 12 మంది సభ్యులను అకారణంగా సస్పెండ్ చేశారని, వారిపై నిషేదాన్ని ఎత్తివేయాలని సభలో, బయట నిరసన తెలపనున్నారు.
ఇక జాతీయ ధాన్యం సేకరణ విధానం తెలిపాలని లోక్సభలో టీఆర్ఎస్ పార్టీ పక్షనేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం, అదేవిధంగా కాలింగ్ అటెన్షన్ నోటీసు ఇచ్చారు. జాతీయ ధాన్యం సేకరణ విధానం, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, యాసంగిలో తెలంగాణ నుంచి ఎంత ధాన్యం, బియ్యం సేకరిస్తారో చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. శీతాకాల సమావేశాల తొలి రోజు నుంచి ఈ అంశంపై పార్టీ ఆందోళనలు కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగా బుధవారం రాజ్యసభలో ఎంపీలు రోజంతా ఆందోళనలు కొనసాగించారు. దీంతో సభ మూడుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఆందోళనలతో లోకసభ రెండు సార్లు వాయిదాపడినప్పటికీ.. సభా కార్యకలాపాలు కొనసాగాయి. నేడు కూడా సభలో ఆందోళనలు కొనసాగించనున్నారు.