న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నవోదయ విద్యాలయాలు కేటాయించాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ బిడ్డలు భారతీయులు కాదా? ఎందుకీ వివక్ష? అని కేంద్రాన్ని ఎంపీ నామా నిలదీశారు. తెలంగాణలో నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కే. కేశవరావు, లోకసభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే ఈ వాయిదా తీర్మానాలను ఉభయ సభలు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎంపీ నామా నాగేశ్వర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్ వేదికగా పలుమార్లు చెప్పినప్పటికీ, కేంద్రం పెడచెవిన పెడుతుందని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, ఎస్టీ రిజర్వేషన్లు, నిరుద్యోగం, నవోదయ విద్యాలయాల ఏర్పాటు వంటి అంశాలను లేవనెత్తామని తెలిపారు. ఇవాళ నవోదయ విద్యాలయాల అంశంపై రాజ్యసభ, లోక్ సభల్లో వాయిదా తీర్మానం ఇచ్చాము. వాయిదా తీర్మానం పై చర్చించాలి.. తెలంగాణకు అన్యాయ జరుగుతుందిని చెప్పాము. కానీ కేంద్రం పట్టించుకోలేదు. రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఉభయ సభల నుంచి వాకౌట్ చేశామని ఎంపీ తెలిపారు.
జిల్లాకొక నవోదయ విద్యాలయం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఎంపీ నామా నాగేశ్వర్ రావు గుర్తు చేశారు. ప్రస్తుతం 9 నవోదయ విద్యాలయాలు మాత్రమే ఇచ్చారు.. ఇంకా 23 ఇవ్వాల్సి ఉంది. 8 ఏండ్ల నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తాము. ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.. కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. 33 జిల్లాలకు 33 నవోదయ విద్యాలయాలు ఇవ్వాల్సిందేనని ఎంపీ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా 7 ఐఐఎం లు.. 4 ఎంఐటీలు.. 16 ఐఐటీలు, 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారు.. ఇందులో తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదని గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ పట్ల కేంద్రం ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలుస్తుందన్నారు. మా కంటే చిన్న రాష్ట్రాలైన అసోంలో 27, గుజరాత్ లో 31, హర్యానాలో 21, హిమాచల్ ప్రదేశ్లో 17, మణిపూర్లో 11, త్రిపురలో 7 నవోదయ విద్యాలయాలు ఉన్నాయని నామా నాగేశ్వర్ రావు గుర్తు చేశారు.