ఢిల్లీ: ధాన్యం సేకరణపై పార్లమెంటులో టీఆర్ఎస్ (TRS) అలుపెరుగని పోరాటం చేస్తున్నది. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మరోసారి వాయిదా తీర్మానం ఇచ్చింది. లోక్సభలో పార్టీ పక్ష నేత నామా నాగేశ్వరరావు ధాన్యం సేకరణపై స్పీకర్ ఓం బిర్లాకు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు.
రాష్ట్రంలో తమ రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎఫ్సీఐ సేకరించడం లేదని, దీంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారని అందులో పేర్కొన్నారు. ఈ అంశంపై లోక్సభలో చర్చించాలని కోరారు. దేశంలో ఆహార ధాన్యాల సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన జాతీయ విధానం అవలంభించాలని డిమాండ్ చేశారు.